అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి జగన్కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జగన్ మోహన్ రెడ్డితోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందికి కూడా సమన్లు జారీ అయ్యాయి.
జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ తన మొదటి ఛార్జిషీటును మార్చి 31న దాఖలు చేసింది. ఈ ఛార్జిషీటును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు దాని ఆధారంగా జగన్కు సమన్లు జారీ చేసింది.
కాగా ఆస్తుల కేసుకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకూ సీబీఐ ప్రశ్నించలేదు. సీబీఐ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చన్న వాదనలు వచ్చాయి. ఈ నేపధ్యంలో 2జి కుంభకోణంలో మాజీమంత్రి ఎ.రాజాను అరెస్టు చేసినట్లే జగన్ మోహన్ రెడ్డిని కూడా అరెస్టులు చేస్తారన్న ఊహాగానాలు వినబడుతున్నాయి.
త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న వేళ జగన్ అరెస్టు జరిగితే ఆయన పార్టీకి భారీ ప్రయోజనమే జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకోవైపు జీవోల జారీలో అవకతవకలకు పాల్పడిన సంబంధిత శాఖల మంత్రులను ప్రశ్నించకపోవడం కూడా జగన్ మోహన్ రెడ్డికి లాభించే అంశంగా వారు చెప్పుకొస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. Published Date: 2012-05-07 15:14:54 GMT
|