వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఫులు బెయిల్ లేదా మధ్యంతర మంజూరు చేయాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటీషన్ను కోర్టు కొట్టివేసింది.
వాస్తవానికి ఈ తీర్పును శుక్రవారం ఉదయమే వెలువడాల్సి ఉంది. అయితే, కోర్టు న్యాయమూర్తి మాత్రం తొలుత రిజర్వులో ఉంచి, రాత్రి 7 గంటల 10 నిమిషాలకు బెయిల్ పిటీషన్ను సీబీఐ కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.
అక్రమాస్తుల కేసులో జగన్ను గత ఆదివారం రాత్రి సీబీఐ అరెస్టు చేసి, సోమవారం కోర్టులో హాజరు పరిచిన విషయం తెల్సిందే. అనంతరం ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఈనెల 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు న్యాయవాదులు విన్నవించారు.
దీనికి సీబీఐ తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం అక్రమాస్తుల కేసు కీలక దశలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో జగన్ను విడుదల చేస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా సాక్షులను బెదిరించేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని కోర్టుకు తెలిపింది.
ఇరు తరపు వాదనలన్నీ గురువారమే పూర్తయినప్పటికీ.. తీర్పును మాత్రం శుక్రవారానికి వాయిదా వేశారు. ఆ ప్రకారంగా శుక్రవారం రాత్రి బెయిల్ పిటీషన్పై తీర్పును కోర్టు వెలువరించింది. Published Date: 2012-06-01 15:52:13 GMT
|