తెలుగు సినిమా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకునేలా తయారు చెయ్యాలన్న ఉద్దేశంతో 2008లో ప్రారంభించిన రామానాయుడు ఫిలిం స్కూల్ విజయవంతంగా నడుస్తున్నది. ఇందులో శిక్షణ పొందిన చాలామంది విద్యార్థులు ఇప్పటికే సినిమా పరిశ్రమలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు ప్రామాణిక మరియు ప్రాక్టికల్ శిక్షణతో పాటు సినిమా పరిశ్రమలో అనుభవం ఉన్న ప్రముఖ దర్శకులు మరియు ఇతర సాంకేతిక నిపుణులు తమ అనుభవాలను విధ్యార్ధులతో పంచుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో బాగంగా ఇటీవల దర్శకులు రాంగోపాల్ వర్మ, ఆర్ .నారాయణ మూర్తి ,తేజ, రామానాయుడు ఫిలిం స్కూల్కి వచ్చి విద్యార్థులతో తమ అనుభవాలని పంచుకున్నారు.
రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ సినిమాపై విద్యార్థుల విశ్లేషణ చాలా బాగుంది. ఇలా ఉండడం వల్ల చాలా వరకు మంచి స్క్రిప్ట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. తాను తర్వాత చెయ్యబోయే కథను అభివృద్ధి చేసే అవకాశం రామానాయుడు ఫిలిం స్కూల్ విద్యార్థులకు ఇస్తున్నానని ప్రకటించారు. అలాగే ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ సినిమాలు తీసేవారికి సాంకేతికతతో పాటు మానవీయ విలువలు, నిర్భయంగా చెప్పగలిగే ధైర్యం ఉండాలి దానితో పాటు వినయవిధేయత చాలా ఉపయోగపడతాయని చెప్పారు.
విద్యార్థులు ఎంతగానో ఉత్తేజితులయ్యారు. అదేవిధంగా తేజ మాట్లాడుతూ ప్రతి దర్శకుడికి ఒక ముద్ర అంటూ ఉంటుంది. అలా ప్రతి కొత్త దర్శకుడు తానూ ఎలాంటి మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో నిర్ణయించుకుని అటువైపు కొత్తదనాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలని చెప్పారు. ఆయన కెమెరా, లైటింగ్కి సంబంధించి అనేక మెళకువల్ని విద్యార్థులకు వివరించారు. ఇలాగే ప్రతి వారం సినిమాకి సంబంధించిన ఒక సాంకేతిక నిపుణుడుతో తరగతులు చెప్పించడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావించి చర్చా తరగతులు నిర్వహించడం జరుగుతోంది. Published Date: 2012-06-08 05:35:48 GMT
|