ఈనెల 19వ తేదీన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ఓటు హక్కును వినియోగించుకున్న నలుగురు ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఓ పత్రికా ప్రకటనను ఆ పార్టీ ప్రధాన కార్యాలమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం నుంచి వెలువడింది.
పార్టీ నుంచి సస్పెండ్ అయిన శాసనసభ్యుల్లో చిన్నం రామకోటయ్య, బాలనాగిరెడ్డి, హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారిలు ఉన్నారు. వీరిలో చిన్నం రామకోటయ్య, బాలనాగిరెడ్డిలు యూపీఏ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేశారు. మిగిలిన ఇద్దరు.. తెలంగాణకు మద్దతు పలుకుతున్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలపరిచిన పీఏ.సంగ్మాకు ఓటు వేసినట్టు సమాచారం.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అయితే, ఈ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం అధినేత నిర్ణయాన్ని ధిక్కరించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఇదిలావుండగా, చంద్రబాబుపై విమర్శలు గుప్పించి పార్టీ నుంచి సస్పెండ్కు గురైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. Published Date: 2012-07-20 07:23:29 GMT
|