తెలంగాణపై చంద్రబాబు నాయుడు ఇంతవరకూ స్పష్టమైన వ్యాఖ్యలు చేయకపోయినా, సీమసింహం బాలయ్య మాత్రం పార్టీలోకి వస్తూనే కుండబద్ధలు కొట్టేశారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాస్తామని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెదేపా సమ్మతం తెలిపినట్టు అయింది.
బాలయ్య తెలంగాణ ప్రకటన అనంతరం పార్టీ శ్రేణుల్లో రసవత్తర చర్చ సాగుతోంది. బాలయ్య తెలంగాణకు జై అన్నారు, కనుక అతిపెద్ద ప్రతిపక్షం తెలంగాణ ఏర్పాటుకు ఓకే చెప్పేసినందువల్లా.. రెండు రాష్ట్రాలు ఖాయం అంటున్నారు. ఇదే జరిగితే టీడీపీ జాతీయ పార్టీగా మారుతుంది. దీంతో చంద్రబాబు నాయుడు కేంద్ర స్థాయిలో పాత్ర పోషిస్తారనీ చెప్పుకుంటున్నారు.
ఇక సీమాంధ్రలో సీమసింహం బాలయ్య పాత్ర పోషిస్తే తెలంగాణను మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటారని అంటున్నారు. తెలంగాణ గడ్డపైనే పుట్టాను.. తెలంగాణ మట్టిలోనే కలిసిపోతానని గతంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల్ని సెంటిమెంటుగా కట్టిపడవేశాయనీ, కనుక జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలంగాణలో తెదేపాకు ఎదురుండదని తమ్ముళ్లు ఖుషీఖుషీగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి తెలుగు తమ్ముళ్ల మాటలు కార్యరూపం దాల్చుతాయో లేదో వేచి చూడాల్సిందే. Published Date: 2012-08-17 14:18:32 GMT
|