రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ముగియగానే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలిసింది.
ఈ దఫా పునర్వ్యవస్థీకరణలో కాంగ్రెస్ యువరాజుగా పిలుచుకుంటున్న రాహుల్ గాంధీతోపాటు మెగాస్టార్ చిరంజీవిని ఒకేసారి మంత్రి పదవులు వరించనున్నాయని అంటున్నారు. ఇంకా కేబినెట్ రేసులో కేబినెట్ రేసులో మనీష్ తివారీ, ఆస్కార్ ఫెర్నాండేజ్, జనార్దన ద్వివేది, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి విలాస్ ముత్తెంవార్ ఉన్నట్లు ఢిల్లీలో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఇటీవలే మరణించిన కేంద్రమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు ఈసారి విస్తరణలో రాష్ట్రపతి పదవి కోసం పోటీపడిన సంగ్మా కోసం ప్రచారం చేసిన అగాథా సంగ్మాపై వేటు ఖాయం కాబోతోంది. ఇంకా విదేశీవ్యవహారాల శాఖామంత్రి నుంచి ఎస్ఎం కృష్ణ ఉద్వాసన పలుకుతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మొత్తమ్మీద ఈ దఫా విస్తరణలో కొత్తముఖాలు, యువకులకే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. ఈ తంతు వచ్చే నెల 6 తర్వాత యూపీఎ చేపట్టే అవకాశాలున్నట్లు సమాచారం. Published Date: 2012-08-17 14:20:55 GMT
|