|
మహా అక్రమ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీ పోరుబాటు చేపట్టింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేసిన బారి సరిహద్దు దాటేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా మిగిలిన ఎమ్మెల్యేలు యత్నించి పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు.
ఉత్తర తెలంగాణాను ఎడారి ప్రాంతంగా మార్చివేసే బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకుని తీరతామని, మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అన్ని అక్రమ ప్రాజెక్టులన్నిటినీ ఎత్తివేసే వరకూ తమ పోరాటం ఆగదని చంద్రబాబు నాయుడు అన్నారు.
బాబ్లీని సందర్శించేందుకు బస్సు యాత్ర చేపట్టిన తెలుగుదేశం పార్టీ బృందాన్ని ఆంధ్ర - మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ధర్మాబాద్ వద్ద మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. సరిహద్దు దాటి తమ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీలు లేదని తెదేపా బృందానికి తేల్చి చెప్పారు.
ఇరువైపుల నుంచి ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భారీగా పోలీసులను మొహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ పోలీసులు కర్ఫ్యూ విధించారు.
ఇదిలావుండగా బాబ్లీ ప్రాజెక్టుపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని చంద్రబాబు నాయుడు అన్నారు. చట్టాన్ని, ట్రిబ్యునల్ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించి జలదోపిడికి పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. మహా అక్రమాలకు అడ్డుకట్ట వేసి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే వరకూ తమ పోరు ఆగదని బాబు హెచ్చరించారు.
Published Date: 2010-07-16 03:20:33 GMT
|