ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతిలో పాదయాత్ర చేపట్టారు. తిరుమలలో జరుగుతున్న వరుస అక్రమాలపై తక్షమే సీబీఐతో గానీ, సుప్రీంకోర్టుతో గానీ విచారణ జరిపించాలని డిమండ్ చేస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు.
తితిదేలో తలెత్తున్న వరుస వివాదాలు, శ్రీవారికి రాయలు సమర్పించిన ఆభరణాలు మాయం వంటి కుంభకోణాలతో శ్రీవారి ప్రతిష్ట దెబ్బతింటోందని దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు శుక్రవారం బాబ్లీ ప్రాజెక్టు వద్దకు బస్సుయాత్ర చేపట్టనుంది. ఇదే బాటలో తెలుగుదేశం పార్టీకంటే తమ పార్టీ ఏ మాత్రం తీసిపోకూడదంటూ పీఆర్పీ అధినేత చిరంజీవి అదే రోజు తిరుమల కొండపైకి పాదయాత్ర కార్యక్రమం పెట్టుకొన్నారు. బుధవారం అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా మాట్లాడిన చంద్రబాబు తిరుమల కొండపై అక్రమాలకు నిరసనగా కింద నుంచి పైకి పాదయాత్ర చేయాలనే ఆలోచన ఉందని చెప్పారు.
ఆ తర్వాత అదే రోజు విలేఖరుల సమావేశంలో మాట్లాడిన చిరంజీవి ఈ నెల 16వ తేదీన తాను తిరుమల కొండపైకి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న తాను చంద్రబాబు కంటే ముందే కొండపైకి పాదయాత్ర జరపాలన్న పట్టుదలతో ఆయన ఈ తేదీని ఖరారు చేసుకొన్నట్లు సమాచారం Published Date: 2010-07-16 03:29:13 GMT
|